మే6న తెలంగాణకు జస్టిస్​ ఘోష్​!

మే6న తెలంగాణకు జస్టిస్​ ఘోష్​!
  •     ఆరేడు రోజులు ఇక్కడే ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ
  •     అధికారులతో పాటు మేధావులు, నిపుణులతోనూ భేటీ 
  •     మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్న జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​ జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. ఆరేడు రోజులపాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేయనున్నట్టు తెలిసింది. 12వ తేదీ వరకు ఆయన రాష్ట్రంలోనే ఉండనున్నట్టు సమాచారం.  తొలుత అధికారులతో జస్టిస్​ ఘోష్​ భేటీ అవుతారని తెలిసింది. వారి దగ్గర్నుంచి మరికొంత సమాచారాన్ని తీసుకున్న తర్వాత.. మేధావులు, నిపుణుల నుంచి కూడా ప్రాజెక్ట్​పై ఒపీనియన్స్​ సేకరించే అవకాశాలున్నాయి. అనంతరం రెండు మూడు రోజులు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను జస్టిస్​ ఘోష్​ పరిశీలించనున్నట్టు తెలిసింది.  ఫీల్డ్​అధికారులను పిలిచి బ్యారేజీ స్వరూపాన్ని తెలుసుకుంటారు. 

బ్యారేజీ కట్టినప్పటి నుంచి కుంగిపోయేదాకా జరిగిన క్రొనాలజీకి సంబంధించిన అంశాలను జస్టిస్ ఘోష్​ ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. చాలా టెక్నికల్​ అంశాలు ఉండటంతో వాటి గురించి మరింత లోతుగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యారేజీ కుంగడానికి బాధ్యులైనవారినీ పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.  గత నెల 25న రాష్ట్రానికి వచ్చిన ఆయన ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సెక్రటరీలు, ఈఎన్సీలు, ఇంజినీరింగ్​ అధికారులతో సమావేశమయ్యారు. కాగ్, విజిలెన్స్​, ఎన్​డీఎస్​ఏల ప్రైమరీ రిపోర్టులతోపాటు పలు ఫైళ్లను అధికారుల నుంచి తీసుకున్నారు. ఇప్పటికే పబ్లిక్​ ఒపీనియన్లు, సాక్ష్యాలను తీసుకునేందుకు సర్కారు ద్వారా బహిరంగ ప్రకటన కూడా ఇప్పించారు.

మూడు నాలుగు రోజుల్లో ఎన్​డీఎస్ఏ రిపోర్ట్?

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటికే నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిపుణుల కమిటీ విచారణ చేస్తున్నది. పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన చంద్రశేఖర్​అయ్యర్​ నేతృత్వంలోని ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ.. బ్యారేజీలను పరిశీలించింది. అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక త్వరగా వచ్చేలా చూడాలంటూ గత సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులకు జస్టిస్​ ఘోష్​ సూచించారు. దాని ఆధారంగా కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. దీంతో ఈ మూడునాలుగు రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక కూడా వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బ్యారేజీని తిరిగి వాడుకునేందుకు టెంపరరీగా చేపట్టాల్సిన పనులపై ఎన్​డీఎస్ఏకి ఇటీవలే రాష్ట్ర అధికారులు లేఖ రాశారు. దీంతో ఆ నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి విషయాన్ని విస్పష్టంగా రిపోర్ట్​లో పేర్కొంటున్నట్టు సమాచారం.