హైకోర్టు కొత్త సీజేగా సతీశ్‌‌‌‌ చంద్ర

హైకోర్టు కొత్త సీజేగా సతీశ్‌‌‌‌ చంద్ర

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌‌‌‌ సతీశ్‌‌‌‌చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అలాగే, దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల హైకోర్టులకు చీఫ్‌‌‌‌ జస్టిస్​ల నియామకానికి, ఐదు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ల బదిలీలకు రాష్ట్రపతి ఓకే చెప్పారు. మరో 17 మంది న్యాయమూర్తుల ట్రాన్స్​ఫర్ల ఫైళ్లను కూడా రాష్ట్రపతి క్లియర్ చేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖ శనివారం గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్ ఇచ్చింది. పోయిన నెల 16 న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తుల, 28 మంది న్యాయమూర్తుల పేర్లను బదిలీకి, మరో 8 మంది న్యాయమూర్తుల పేర్లను ప్రధాన న్యాయమూర్తులుగా ప్రమోషన్లకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఇందులో ప్రస్తుతం కర్నాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సతీశ్ చంద్ర శర్మ ప్రమోషన్​పై తెలంగాణ సీజేగా రానున్నారు. కొత్త చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌గా సతీశ్ చంద్రతో రాష్ట్ర గవర్నర్‌‌‌‌ తమిళి సై సోమవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం చత్తీస్​గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌‌‌‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్​గా అపాయింట్ కానున్నారు. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ జస్టిస్​గా పనిచేస్తున్న జస్టిస్ రామచందర్​రావు హర్యానా, పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్​కు చెందిన జస్టిస్ సతీశ్ చంద్ర.. 1984 లో అదే రాష్ట్రంలో అడ్వకేట్​గా కెరీర్​ను ప్రారంభించారు. చిన్న వయసులోనే సీనియర్‌‌‌‌ లాయర్‌‌‌‌గా పదోన్నతి తెచ్చుకున్నారు.1993లో  కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ గా సేవలందించారు. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సెల్​గా నియమితులయ్యారు. 2008 లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఆగస్టు నుంచి కర్నాటక హైకోర్టు యాక్టింగ్‌‌‌‌ సీజేగా పనిచేస్తున్నారు.

ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉన్నా: జస్టిస్ రామచందర్​రావు

పని ఒత్తిడితో కుటుంబంతో గడపలేకపోయానని, ఇప్పుడు బదిలీతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలవుతుందని హైకోర్టు సీనియర్ లాయర్‌‌ జస్టిస్ రామచందర్​రావు అన్నారు. రామచందర్​రావు పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ అయినందున జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులు ఆయనకు శనివారం ఆన్​లైన్​లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్​రావు మాట్లాడారు. చట్టానికి లోబడి విధులు నిర్వహించానని, తాను ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన తండ్రి, పలువురు సీనియర్ న్యాయమూర్తుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.