ఒమన్ తీరం దగ్గర 14 మంది భారతీయులతో వెళ్తున్న నౌకపై దాడి జరిగింది. 2026 సెప్టెంబర్ 13న వాణిజ్య నౌక ఎంటి ఎల్ గైయా (MT El Gaia)పై దాడి జరిగింది. ఈ దాడిలో నౌకపై ఉన్న 14 మంది నావికుల్లో 13 మందిని సురక్షితంగా రక్షించగా.. ఒకరు తప్పిపోయినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఒమన్ తీరం దగ్గర జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొంది. తప్పిపోయిన వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని గమనిస్తోంది. 13 మంది భారత నావికులను సురక్షితంగా తీరానికి తరలించారు. తప్పిపోయిన ఒకరి కోసం ఒమన్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని రాయబార కార్యాలయం తెలిపింది.
ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం తగదని MEA స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించి, చర్చలు, దౌత్యం ద్వారా శాంతిని సాధించాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛగా, సురక్షితంగా నౌకా రాకపోకలు, వాణిజ్యం కొనసాగాలని భారత్ పిలుపునిచ్చింది.
మరోవైపు ఇటు బ్రిక్స్ సమావేశాలు జరుగుతుండగా ఈ ఘటన జరగటం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు పరస్పర సహకారం ఉండాలని బ్రిక్స్ సదస్సులో తీర్మానం చేసిన తర్వాతి రోజే ఈ దాడి జరగటం గమనార్హం.
