భారత తదుపరి సీజేగా యూయూ లలిత్

భారత తదుపరి సీజేగా యూయూ లలిత్

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన పేరును పేరును ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన లేఖను సీజేఐ కేంద్ర న్యాయ శాఖకు పంపగా.. అక్కడి నుంచి దాన్ని ప్రధాని కార్యాలయానికి పంపారు. పీఎం మోదీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి పేషీకి వెళ్లింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము 49వ సీజేఐగా ఉదయ్ ఉమేష్ లలిత్ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో 27న ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. జస్టిస్ లలిత్ పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది.  నవంబర్ 8న ఆయన రిటైర్ కానున్నారు. 

1957 నవంబర్ 9న జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985 డిసెంబర్ వరకు బొంబాయి హైకోర్టులో పనిచేసిన ఆయన.. 1986 జనవరి నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు. 2014 ఆగస్టు 13న యూయూ లలిత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పులు ఇచ్చారు. దేశంలోనేతీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్ తలాక్‌తోపాటు అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.