- డీజీపీకి ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఫిర్యాదు
బషీర్ బాగ్, వెలుగు : ‘‘జూన్ 23న సివిల్ డ్రెస్సుల్లో ఉన్న కొందరు పోలీసు అధికారులు నాపై దాడికి యత్నించారు. దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సివిల్ డ్రెస్లో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు”అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. బుధవారం లక్డీకాపూల్లోని డీజీపీ ఆఫీస్లో డీజీపీ అంజనీకుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు.
సదాశివపేట్ ఇన్స్పెక్టర్ నవీన్కుమార్, మహిళా ఎస్సై లక్ష్మి తన సిబ్బందితో వచ్చారని డీజీపీకి వివరించారు. తనతో పాటు సిబ్బందిపై దాడికి ప్రయత్నించారన్నారు. తర్వాత కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా సిరిసిల్లలో కేటీఆర్ అనుచరుడు తనపై దాడి చేశాడని, ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తనపై దాడులకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.