కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై  కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదని విమర్శించారు. 

మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నమే ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన అని అన్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించామని బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని విమర్శించారు. 

 కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదని తెలిపారు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయని విమర్శించారు. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.