ప్రియాంక, దిల్జీత్ రైతులను రెచ్చగొడుతున్నారు

ప్రియాంక, దిల్జీత్ రైతులను రెచ్చగొడుతున్నారు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలు 16వ రోజుకు చేరాయి. అన్నదాతల నిరసనలకు విపక్ష పార్టీలతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. రైతులకు మద్దతుగా నిలుస్తున్న హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పంజాబీ నటుడు, సింగర్ దిల్జీత్ దోసాంజాపై కంగన ఫైర్ అయ్యింది. నిరసనలను సపోర్ట్ చేయడం ద్వారా రైతులను ప్రియాంక, దిల్జీత్ రెచ్చగొడుతున్నారని కంగనా ఆరోపించింది. సమస్య వారి (ప్రియాంక, దిల్జీత్)తోనే కాదు. రైతులకు మద్దతునిస్తూ, కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారందరితో ఉంది. ఈ చట్టాలు ఎంత ముఖ్యమో తెలిసీ కావాలనే, తమ అల్ప ప్రయోజనాల కోసం అమాయక రైతులను హింసకు పాల్పడేలా, భారత్ బంద్ చేసేలా రెచ్చగొడుతున్నారు’ అని కంగన ట్వీట్ చేసింది.

‘దిల్జీత్ దోసాంజ్, ప్రియాంక చోప్రా లాంటి వ్యక్తులను లెఫ్ట్ మీడియా నడిపిస్తోంది. వీళ్లు రైతులను తప్పుదోవ పట్టించడమే గాక నిరసనలను ప్రోత్సహిస్తున్నారు. ఇస్లామిస్ట్ అనుకూల, భారత వ్యతిరేక ఫిల్మ్ ఇండస్ట్రీ వీరికి మంచి ఆఫర్లు ఇస్తుంది’ అని కంగన పేర్కొంది.

‘దిల్జీత్ దోసాంజ్, ప్రియాంక చోప్రా మీకు నిజంగా రైతుల గురించి ఆందోళనగా ఉంటే, మీరు నిజంగా మీ తల్లులను గౌరవిస్తే ఓ మాట వినండి.. వ్యవసాయ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి. లేదంటే దేశద్రోహుల చెంతకు వెళ్లిపోవాలనుకుంటున్నారా?’ అని కంగన ట్వీట్ చేసింది.