సోమేశ్.. మా గోసే మీకు పట్టింది: ఉపాధ్యాయుడి లేఖ

సోమేశ్.. మా గోసే మీకు పట్టింది: ఉపాధ్యాయుడి లేఖ

తెలంగాణలో కొత్త జోన్లు, జిల్లాలకు అనుగునంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం తెచ్చిన 317 జీవోపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ  జీవోను రద్దుచేయాలంటూ  ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు  రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు.  ఇటీవల ప్రగతి భవన్ ను కూడా ముట్టడించారు. 317 జీవో వల్ల కుటుంబాలను వదిలి జిల్లా కానీ జిల్లాకు వెళ్లి  ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు.  రోడ్డెక్కారు.. కోర్టుకెళ్లారు అయినా ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లక తప్పలేదు.

అయితే నిన్న తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను   ఏపీకి వెళ్లాలంటూ హైకోర్ట్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తానిపర్తి తిరుపతి రావు అనే ఉపాధ్యాయుడు సోమేశ్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది. తమకు పట్టిన గతే మీకు పట్టిందని..తమ గోసే మీకు వచ్చిందని.. సోమేశ్ పై సెటైర్లు వేశారు.

మీకు కర్మ సిద్ధాంతం అంటే ఎంటో తెలుసా అంటూ  సోమేశ్  కుమార్ ను ఉద్దేశిస్తూ తిరుపతి రావు సెటైర్లు వేశారు.  అప్పట్లో కోర్టు తమకు ఏ తీర్పు ఇచ్చిందో ఇపుడు మీకు కూడా అదే తీర్పు ఇచ్చిందంటూ విమర్శించారు. మీరు తమను  బలవంతంగా ఏ విధంగా బదిలీ చేశారో కోర్టు మిమ్మల్ని కూడా అలాగే  బదిలీ చేసిందని.. దీనినే కర్మ సిద్దాంతం అంటారని లేఖలో పేర్కొన్నారు. మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దని.. అలా చేస్తే ఎప్పుడో ఒకప్పడు మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని  సెటైర్ వేశారు తిరుపతి రావు. ఇపుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.