
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయానా ఆయనే అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయిందని.. బసవరాజు తన ట్వీట్లో పేర్కొన్నారు. స్వల్ప కరోనా లక్షణాలతో తాను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్లో ఉండాలని సీఎం బసవరాజు బొమ్మై విజ్ఞప్తి చేశారు.
ఇంతకు జనవరిలోనూ ఒకసారి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకి కొవిడ్ సోకింది. అప్పుడు కూడా ఆయన కరోనా స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు కోలుకున్న బసవరాజు... తాజాగా చేయించిన టెస్టుల్లో మరోసారి కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన కూడా రద్దయింది.