కోడి కూర తినలేదని.. కొడుకును చంపాడు

కోడి కూర తినలేదని.. కొడుకును చంపాడు

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కోడి కూర రుచి చూడలేదని ఓ తండ్రి, కొడుకుని హత్య చేశాడు. ఇంట్లో చేసిన వంటకం రుచి చూడలేదని ఓ తండ్రి కోపంతో కన్న కొడుకును అక్కడే ఉన్న చెక్క కర్రతో కొట్టాడు. దీంతో 32 ఏళ్ల ఆ కొడుకు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలోని సుల్లియా తాలూకా గుత్తిగర్‌లో ఏప్రిల్ 4న జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇంట్లో కోడి కూర తినాలనే విషయంపై తండ్రి షీనా, కుమారుడు శివరాం మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి.. చివరకి హత్యకు దారి తీసింది. అంతకు ముందు శివరాం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి.. అతని తండ్రి ఇంట్లో చికెన్ కర్రీని రెడీ చేసి పెట్టాడు. కొడుకు ఇంటికి రాగానే రుచి చూడమనడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన తండ్రి, కొడుకును చెక్కతో కొట్టాడు. ఆ వెంటనే భయపడిన తండ్రి ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. 

చికెన్ కర్రీ విషయంలో తలెత్తిన వివాదం కన్న కొడుకు చంపుకునే వరకు వెళ్లటం సంచలనంగా మారింది. అదుపు తప్పుతున్న కోపం తనా మనా అనే బేధం లేకుండా చేస్తుంది. చిన్న విషయాలకే ఈ మధ్య కోపం కట్టలు తెచ్చుకుంటుంది అనటానికి ఇదే నిదర్శనం. ఏడాది క్రితం కూడా తెలంగాణలో ఇలాంటి ఘటనే జరిగింది. భార్య కోడి కూర వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.