ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్ చీట్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. నిజం గెలిచిందన్నారు. గతంలో చెప్పినట్లు కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని చెప్పారు. తీర్పు వచ్చిన తర్వాత తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నానని అన్నారు కవిత.
తన తల్లిదండ్రులు, అత్తమామలు తనకు అండగా నిలిచారని కవిత అన్నారు. తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తనకు అండగా నిలబడిన జాగృతి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు కవిత.
లిక్కర్ స్కాంలో రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని విమర్శించారు కవిత. కేసీఆర్,బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే తనపై కేసు పెట్టారని చెప్పారు. ఐదు నెలలు జైల్లోపెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తనను మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారని.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని విమర్శించారు కవిత.
కవితపై సీబీఐ కేసు కొట్టివేత
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, తన ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరి పైన సిబిఐ నమోదు చేసిన కేసులను కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేసులో నిందితులందరి పైన సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టివేసింది. కేసు నమోదు ,దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని ప్రత్యేక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. 45 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విచారణ అనంతరం తీర్పు వెల్లడించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి . విచారణ అనంతరం ఫిబ్రవరి 27న తీర్పు వెల్లడించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్.
