ఫోన్ ట్యాపింగ్​లో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: గోనె ప్రకాశ్

ఫోన్ ట్యాపింగ్​లో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: గోనె ప్రకాశ్

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. రాధాకిషన్ రావు వంటి అధికారుల వాంగ్మూలాలతో కేసీఆర్​తో పాటు.. కేటీఆర్, హరీశ్ రావు జైలు కెళ్తారని వెల్లడించారు. అందుకే చర్లపల్లి జైల్లో కేసీఆర్​కు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని రేవంత్ అంటున్నారని వివరించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ బయట ప్రకాశ్ రావు మీడియాతో మాట్లాడారు. 

ఉద్యమ టైమ్​లో మల్టీ విటమిన్ తీసుకొని కేసీఆర్ దొంగ దీక్ష చేశారని విమర్శించారు. ఆయనకు నీతి, నిజాయితీ ఉంటే దొంగ దీక్షపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో మాదిరిగా ప్రజల్ని మోసం చేసేందుకు కేసీఆర్ మళ్లీ ప్రజా బాట పట్టారని ఆరోపించారు.  ప్రజల్లో ఆదరణ తగ్గిందని, అందుకే ఎన్నడూ లేని విధంగా స్ట్రీట్ కార్నర్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు.