లాస్య నందిత లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా: కేటీఆర్

లాస్య నందిత లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా: కేటీఆర్

సికింద్రాబాద్,  కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆమె లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఆమెను వారం రోజుల క్రితమే కేటీఆర్ పరామర్శించారు.

ఈ క్రమంలో కొద్దిసేపటిక్రితం కేటీఆర్ తన ఎక్స్ లో స్పందిస్తూ.. "ఇది దాదాపు వారం క్రితం. లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన షాకింగ్ న్యూస్ ఇప్పుడే విన్నాను. మంచి యువ ఎమ్మెల్యే మరణించారనే విషాదకర వార్త లేవగానే విన్నాను. ఈ వార్త తనను ఎంతో బాధించింది. ఈ క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాన్నా" అని అన్నారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన ఆమె.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.  కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు.  శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే లాస్య లేరన్న విషయం నమ్మలేకపోతున్నానని కేటీఆర్ అన్నారు.  

ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు దగ్గర ORR పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల మృతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.