పెట్రోల్ బాటిల్‌తో కేసిఆర్ వీరాభిమాని

పెట్రోల్ బాటిల్‌తో కేసిఆర్ వీరాభిమాని

ఆత్మహత్య చేసుకుంటానంటూ వ్యక్తి బెదిరింపు
అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
గతంలో కేసీఆర్‌కు ‌గుడి కట్టిన రవీందర్

హైదరాబాద్/దండేపల్లి, వెలుగు: పెట్రోల్ బాటిల్‌తో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. శుక్రవారం ప్రగతిభవన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన గుండా రవీందర్(55)ను సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేశారు. అతని బ్యాగ్‌లో పెట్రోల్ బాటిల్‌ను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. మంచిర్యాల పోలీసులు, స్థానిక నేతలు తన సమస్యను పరిష్కరించడం లేదంటూ తన ఆవేదనను చెప్పుకున్నాడు.

కేబుల్ టీవీ వివాదంతో..
కేబుల్ నెట్ వర్క్​కు సంబంధించి హైటెక్ సిటీ కేబుల్ యజమాని మౌలానాతో రవీందర్‌కు డబ్బు లావాదేవీల వివాదం ఉంది. దీనిపై దండేపల్లి, లక్సెట్టిపేట్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. తన కేబుల్ టీవీ నెట్ వర్క్‌ను స్థానికంగా ఉండే ఓ రౌడీ షీటర్ ఆక్రమించుకున్నాడని పోలీసులకు రవీందర్ ఫిర్యాదు చేశాడు. వాళ్లు పట్టించుకోలేదని, స్థానిక నేతలను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రగతిభవన్‌కు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించానని పంజాగుట్ట పోలీసులకు రవీందర్ చెప్పాడు.

కేసీఆర్‌కు వీరాభిమాని
మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన రవీందర్ తనకున్న రెండెకరాల పొలం అమ్మి సొంతూరులో శ్రీ సాయి కేబుల్ టీవీ పేరుతో కేబుల్ నెట్ వర్క్ నిర్వహిస్తున్నాడు. రవీందర్ కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 2001 నుంచి టీఆర్ఎస్‌లో ఉన్నాడు. కేసీఆర్ పై అభిమానంతో ఆయన పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. మెడలో కేసీఆర్ బొమ్మ ఉన్న గోల్డ్​ చైన్ వేసుకునేవాడు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌కు తన ఇంటి ఆవరణలో గుడి కట్టాడు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని కలెక్టర్ నుంచి అవార్డ్ కూడా తీసుకున్నాడు.