
హైదరాబాద్, వెలుగు: ముందే నిర్ణయించిన ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7 వరకు లాక్ డౌన్ను ఎప్పటిలాగే కొనసాగించాలని, అప్పటివరకు ఎక్కడా సడలింపులు ఇవ్వొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. కేంద్రం విడుదల చేసిన లాక్డౌన్ గైడ్ లైన్స్, సడలింపులపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని వారికి సూచించారు. ఈ నెల 7 తర్వాత ఏం చేయాలన్న దానిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. కేంద్రం జారీ చేసిన రూల్స్ ప్రకారం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో లాక్ డౌన్ సడలింపులను ఈ నెల 7 తర్వాత అమలు చేసే చాన్స్ ఉందని ఉన్నతాధికారులు అన్నారు.
గైడ్లైన్స్ స్టడీ చేస్తున్నం: సీఎస్
లాక్ డౌన్ పై కేంద్రం విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ ను స్టడీ చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్కుమార్ చెప్పారు. వీటిపై ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకుంటారని, అప్పటి వరకు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.