కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ఆందోళనలు నెలకొనడంతో కేరళ ప్రభుత్వం అలర్టైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ తీసుకోని వారు కరోనా ఉచిత వైద్య చికిత్సకు అర్హులు కారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కరోనాపై సమావేశం తర్వాత విజయన్ మాట్లాడుతూ... రాష్ట్ర కరోనా నియంత్రణ చర్యల్లో భాగస్వామ్యం కాని వారు ఉచిత చికిత్సను పొందలేరని అన్నారు. ఒకవేళ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోని వారికి కరోనా సోకితే.. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించదని అన్నారు. అలెర్జీ, మరేదైనా వ్యాధి కారణంగా వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రభుత్వ డాక్టర్ జారీచేసిన సర్టిఫికెట్ ను సమర్పించాల్సి వుంటుందని అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా డాక్టర్ సర్టిఫిక్ ను సమర్పించాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారు తప్పనిసరిగా వారానికి ఒకసారి సొంత ఖర్చులతో RTPCR టెస్టులు చేయించుకోవాలని, పరీక్ష రిపోర్టులను అధికారులకి సమర్పించాల్సి వుంటుందని సూచించారు సీఎం పినరయి. కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించే వారికి కూడా ఈ నిబంధనలు తప్పనిసరి అని, పాఠశాలలు, కాలేజీల విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రయాణికులకు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిచాలని విమానాశ్రయ అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా డిసెంబర్ 1 నుండి 15 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని సూచించారు విజయన్.