- రెండు గంటల్లోనే కిడ్నాపర్ పట్టివేత
- బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చిన పోలీసులు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడాది వయసున్న బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తల్లిని నమ్మించి ఓ మహిళ చిన్నారిని అపహరించింది. అయితే రెండు గంటల్లోనే రైల్వే పోలీసులు ఈ కేసును చేధించారు. కిడ్నాప్ కు గురైన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రైల్వే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గుంటూరు నుంచి ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆమెకు ఏడాది బాబు ఉన్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాక ఓ మహిళ ఆమెతో చనువుగా మాట్లాడటం మొదలు పెట్టింది. బిస్కెట్లు ఇచ్చి బాలుడిని మచ్చిక చేసుకుంది. ఇంతలోనే బాలుడి తల్లి వాష్ రూమ్ కు వెళ్తున్నానని, బాలుడిని చూసుకోవాలని ఆ మహిళతో చెప్పింది. ఆ మహిళ సరే అనడంతో బాలుడి తల్లి వాష్ రూమ్ కి వెళ్లింది. అయితే ఆమె తిరిగి వచ్చేసరికి బాలుడిని ఎత్తుకొని ఆ మహిళ పారిపోయింది. దీంతో షాక్ కు గురైన బాలుడి తల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలుడు కిడ్నాప్ గురయ్యాడనే సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా మహిళ బాలుడిని ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే చేజ్ చేసి కవాడిగూడలో ఆటోను పట్టుకున్నారు. కిడ్నాపర్ నుంచి బాలుడిని రక్షించి తల్లికి క్షేమంగా అప్పజెప్పారు. కిడ్నాప్ చేసిన మహిళను మరియమ్మగా గుర్తించిన పోలీసులు... ఆమెపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.