
రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస మూవీలతో దూసుకుపోతున్నాడు. ఎస్ఆర్ కల్యాణ మండపంతో మంచి హిట్ కొట్టిన అతను..ఇప్పటికే మూడు చిత్రాల్లో నటిస్తుండగా..తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టాడు. రత్న కృష్ణం దర్శకత్వంలో నటిస్తున్న రూల్స్ రంజన్ సినిమాను షురూ చేశాడు. సినీ ప్రముఖుల మధ్య ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకుడు క్రిష్ తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ,దర్శక, నిర్మాత ఏ.ఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ , సిద్ధార్థ సేన్ ,అతుల్ పర్చురే ,ఆశిష్ విద్యార్థి, అజయ్ నటిస్తున్నారు. కో డైరెక్టర్ గా శ్రీకాంత్, కో ప్రొడ్యూసర్ గా రింకు కుక్రెజ వ్యవహరిస్తున్నారు. డీఓపీ బాధ్యతలను దులీప్ కుమార్ చూస్తుండగా, అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం..రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు కిరణ్. ఆ తర్వాత వచ్చిన సెబాస్టియన్ పీసీ 524తో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. తాజాగా రూల్స్ రంజన్ మూవీని మొదలు పెట్టాడు.