
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ డివిజన్ లో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆదివారం నిర్వహించిన స్కాలర్ షిప్, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో అత్యుత్తత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 40 మందికి రూ.90 వేల విలువైన చెక్కులు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 400 మందికి నోట్బుక్స్అందించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ను అభినందించారు. ప్రభుత్వ టీచర్లకు డీఏలు సరిగా అందడం లేదని, రిటైరైన వారికి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితి రాష్ర్టంలో ఉందన్నారు. ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.