రైతుల సంక్షేమమే ధ్యేయంగా.. మోడీ సర్కార్​ పాలన

రైతుల సంక్షేమమే ధ్యేయంగా.. మోడీ సర్కార్​ పాలన

కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.  నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక పంటలకు కనీస మద్దతు ధర 60 నుంచి 80 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. కాలానుగుణంగా పంటల బీమా పథకంలో మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పంటల బీమా పథకం అమలు సరిగ్గా జరగట్లేదని అన్నారు.  దేశంలో 52 శాతం పాల ఉత్పత్తి పెరిగిందన్నారు.

2009 – 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1.52 లక్షల మెట్రిక్​ టన్నుల పప్పు ధాన్యాలు కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగేళ్లలోనే 82.21 లక్షల మెట్రిక్​ టన్నుల పప్పు దినుసులను కేంద్ర ప్రభుత్వం సేకరించినట్లు చెప్పారు. అన్ని పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ర్ట ప్రజలకు వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.   ఆహార ఉత్పత్తులకు ఇటీవల ప్రకటించిన ఎంఎస్​పీ ధరలు 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని వివరించారు. 

తెలంగాణకు అధిక ప్రాధాన్యత..

ప్రధాన్​ మంత్రి కృషి సించాయ్​ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ర్టంలో చిన్న సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద తెలంగాణలో 11  ప్రాజెక్టులకు గానూ రూ.1,248 కోట్లు కేటాయించామన్నారు. రాష్ర్ట రైతులకు ఎరువుల మీద రూ.27 వేల కోట్ల సబ్సిడీని అందిస్తున్నట్లు వెల్లడించారు.  ఎకో ఫ్రెండ్లీ లిక్విడ్​ నానో యూరియా తయారీ ప్రారంభమైనట్లు చెప్పారు.