నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని ఆయోధ్య రామమందిర ట్రస్టు సభ్యులు, పూజారులు ఆరోపించారు. మరో నెల రోజుల్లో ఓలీ ప్రభుత్వం కూలిపోతుందంటూ శపథం చేశారు. శ్రీరాముడు భారతీయుడు కాదని, నేపాల్కు చెందిన వాడని, భారత్ ఫేక్ అయోధ్యను సృష్టిస్తోందని అంటూ ఓలీ చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో సరయూ నది ఒడ్డున ఉన్న ఆయోధ్యలో రామయ్య జన్మించాడని పురాణాలు చెబుతున్నాయని రామమందిర ట్రస్టు సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ చెప్పారు. అయితే సీతమ్మను నేపాల్లో పుట్టన మాట వాస్తవమేనని అన్నారు. కానీ, రాముడు నేపాలీ అనేది మాత్రం అవాస్తవమని, ఓలీ ప్రకటనను తాను ఖండిస్తున్నానని తెలిపారు.
పాక్, చైనా చెప్పు చేతల్లో ఓలీ
నేపాల్ ప్రధాని ఓలీ పాకిస్థాన్ తరఫున పని చేస్తున్నారని ఆరోపించారు రామ దళ ట్రస్టు చీఫ్, రామ మందిర పూజారి అయిన కల్కీ రామదాస్ మహారాజ్. నేపాల్ హిందూ రాజ్యంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఆ దేశ ప్రధాని పాక్, చైనా చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడని అన్నారాయన. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని పురాణాల్లో ఉందని, నేపాల్లో అసలు సరయూ నది అనేదే లేదని చెప్పారాయన. అలాంటప్పుడు రాముడు నేపాల్కు చెందినవాడని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు రామదాస్. నెలలోపే ఓలీ నేపాల్ ప్రధాని పీఠం నుంచి దిగిపోయే రోజు వస్తుందని శపథం చేస్తున్నానని చెప్పారు.
ఓలీ నేపాలీ కాదు
శ్రీరాముడు పుట్టింది భారత్లోని ఆయోధ్యలోనేనని, ఆయన విశ్వం మొత్తానికి చెందినవాడని చెప్పారు
మరో పూజారి మహంత్ పరమహంసాచార్య. నేపాల్ ప్రధాని ఓలీపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఓలీకి పిచ్చిపట్టిందని, అసలు ఓలీ నేపాలీనే కాదని, ఆయనకు నేపాల్ చరిత్ర బొత్తిగా తెలియదని ఆరోపించారు. ఓలీ నేపాలీలను మోసగిస్తున్నారని, నేపాల్ ప్రజలు ఆయనపై తిరగబడాలని, లేకుంటే వారికి దురదృష్టకర పరిణామాలు ఎదురవుతాయని చెప్పారు.