- కేంద్రంతో వద్దనుకుంటే.. రాష్ట్రమే స్వయంగా ముందుకురావాలి
- సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే సీసీఐ పునరుద్ధరణ సాధ్యమవుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి చెప్పారని పేర్కొన్నారు. బుధవారం ఆయన సీసీఐ పునరుద్ధరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
‘ఈ నెల 15న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీసీఐ సాధన సమితి ప్రతినిధులతో కలిశాం. తెలంగాణ ప్రభుత్వం రూ.250 కోట్లు ఇస్తే ప్లాంట్పునరుద్ధరణ సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలుగానీ, రాయితీలు, సహకారంపై అధికారిక సమాచారంగానీ అందలేదని, అందువల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు.
పరిశ్రమ పునరుద్ధరణపై ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకపోవడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం’ అని విమర్శించారు. ఇప్పటికైనా సీసీఐ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అర్హుల ఓట్లు పోవద్దు
రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడంతో చాలామందికి నోటీసులు జారీ చేయబోతున్నారని, అలాంటి ఓటర్లకు నోటీసులందిన వెంటనే పార్టీ శ్రేణులు మార్గనిర్దేశం చేయాలని కేటీఆర్ సూచించారు. అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు. బుధవారం ఆయన నందినగర్లోని తన నివాసంలో పార్టీ ‘సర్’ పర్యవేక్షణ కమిటీతో సమీక్ష చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకుండా చూడాలన్నారు.
