హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో బీర్ల అయిలయ్యమాట్లాడారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. ఫామ్హౌజ్కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి ఇలా తిట్టమని శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళా కానిస్టేబుల్స్ ముందు బట్టలు విప్పేసి వికృత చేష్టలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అన్నారు. వేల డప్పులతో కేసీఆర్ ఫామ్హౌజ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కుట్ర కేసులో కేసీఆర్ను ఏ1గా చేర్చాలి: నాగరాజు
బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే స్పీకర్పై మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ చైర్లో బుద్దుడిలా ప్రశాంతంగా శాంతిమూర్తిగా కన్పించే గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ కుట్రలో భాగస్వాములందరిపై కేసులు పెట్టాలని కోరారు. ఏ1గా కేసీఆర్, ఏ2,ఏ3గా హరీశ్ రావు, కేటీఆర్ పేర్లను చేర్చాలన్నారు. ఆయనతో పాటు నవీన్ రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
