సీతా రామం టీంకు చిరంజీవి అభినందనలు

సీతా  రామం టీంకు చిరంజీవి అభినందనలు

ఇటీవలే విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘సీతా రామం’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారు. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ... ఓ ట్వీట్ చేశారు. ‘సీతా రామం చూశాను. ఒక్క చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతోగానో నచ్చింది. మనస్సులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్, స్వప్నాదత్, ప్రియాంకా దత్ లకు... ఒక ఫ్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హనురాఘవపూడికి శుభాకాంక్షలు. అలాగే కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నిటికన్నా.. ముఖ్యంగా సీతా-రామ్ లుగా ప్రేమ కథకు ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు సూత్రధారి పాత్రను పోషించిన రష్మిక మందన్నకి.. మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు’ అని తెలిపారు. ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయస్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలషిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇక ‘సీతారామం’ సినిమా విషయానికి వస్తే... కశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది. ఫీల్ గుడ్ ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ అధికారి రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాథ. ఆల్ ఇండియా రేడియోలో తానొక అనాథ అని చెప్పగానే.. అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతా మహాలక్ష్మీ (మృణాల్ ఠాకూర్) ఉత్తరాలు రాస్తుంటుంది. దీంతో ఆమెను కలుసుకోవాలని అనుకుంటాడు. హైదరాబాద్ కు వచ్చిన రామ్ కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? వీళ్లిద్దరి మధ్యలో ఆఫ్రిన్ (రష్మిక)కు సంబంధం ఏంటీ ? అనే ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందింది. సుమంత్, ప్రకాష్ రాజ్, ఇతరులు కీలక పాత్రలు పోషించారు.