చరిత్రలో నిలిచిపోయే సాల్వాజుడుం తీర్పును స్వయంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా తప్పుబట్టడం బాధాకరమన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును రాజకీయాలతో ముడిపెడతారా? అని ప్రశ్నించారు.
భారత రాజ్యాంగం , న్యాయవ్యవస్థ పాత్రపై హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ చర్చలో ప్రొఫెసర్ జి. హరగోపాల్, జస్టిస్ రజిని, కోదండరాం, సీనియర్ న్యాయవాదులు, పలు హక్కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాల్వాజుడుం తీర్పుపై మార్చి 3, 2026న లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్చించారు
ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. ‘ఎదుటివారిని చంపేయండి అంటూ ప్రభుత్వం సామాన్యుల చేతికి ఆయుధాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనడం తప్పు అవుతుందా.?. ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఈ తీర్పును న్యాయమూర్తి సొంత భావజాలం అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? ఇది న్యాయమూర్తి వ్యక్తిత్వాన్ని కించపరచడమే కాకుండా.. న్యాయవ్యవస్థ గౌరవాన్ని బట్టకాల్చి మీద పడేయడమే. అధికార విభజన సిద్ధాంతం ఎటుపోతోంది? పార్లమెంటు సాక్షిగా న్యాయవ్యవస్థపై జరుగుతున్న ఈ దాడి.. కేవలం కోర్టుల మీద దాడి కాదు సామాన్య ప్రజల హక్కుల మీద జరుగుతున్న దాడి.న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోకపోతే, ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. భావితరాలకు మనం అన్యాయం చేసిన వారమవుతాం. మేధావులు, న్యాయవాదులు, హక్కుల సంఘాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.. న్యాయ వ్యవస్థపై రాజకీయ దాడి ఆగిపోవాలి.. రాజ్యాంగ విలువల స్వయంప్రతిపత్తి కాపాడబడాలి’ అని అన్నారు.
