అధికారం కోసం మోదీ ఏమైనా చేస్తరు : కూనంనేని  సాంబశివరావు 

అధికారం కోసం మోదీ ఏమైనా చేస్తరు : కూనంనేని  సాంబశివరావు 
  • లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి , ఎమ్మెల్యే కూనంనేని  సాంబశివరావు 

బషీర్ బాగ్, వెలుగు : దేశంలో ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అధికారం కోసం ఆయన ఏమైనా చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాజ్యాంగంపైన ప్రమాణం చేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని ముందుగా జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.

బీజేపీ బందీలో ఉన్న రాముడు తనను ఎవరు విముక్తి చేస్తారా..! అని ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీ,బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్య్లూజే) ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ‘ మీట్ ది ప్రెస్’ నిర్వహించారు. టీయూడబ్య్లూజే  కె.విరాహత్ అలీ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్టు మల్లయ్య మోడరేటర్ గా వ్యవహరించారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కూనంనేని సమాధానాలు ఇచ్చారు.  

మతం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ, రాజ్యాంగాన్ని మార్చబోమని చెప్పి ముస్లిం రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు. లోక్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని,  బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు.  దేశంలోనే అత్యంత అన్యాయమైన, ప్రమాదకరమైన, అవినీతి పార్టీ అయిన బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో 80 శాతం మంది సంపద కేవలం 20 శాతం మంది చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్ మించి బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నిరంకుశ ప్రధాని మోదీని ఓడించేందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చామన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, ఉద్యమకారుల గొంతు నొక్కారని, ఢిల్లీలో మోదీ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కమ్యూనిస్టుల జోలికి వచ్చే వారి పతనం రాస్తామన్నారు.