అల్వాల్, వెలుగు: అల్వాల్ లోని జీఎన్ఆర్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నిషియన్గా పని చేస్తున్న రాము అనే వ్యక్తి అదే ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన రాము (27) కొన్నేళ్లుగా అల్వాల్ లోని కానాజీ గూడలో ఉంటూ జీఎన్ఆర్ హాస్పిటల్లో పని చేస్తున్నాడు. రాము తనకు తానే గుర్తు తెలియని ఇంజక్షన్ తీసుకోవడంతో చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయని పోలీసులు పేర్కొన్నారు.
కాగా ఉద్యోగం మానేయాలనుకున్నాడని సదరు ఆసుపత్రి ఎన్వోసీ ఇవ్వకపోవడం.. రాత్రి పూట డ్యూటీలు వేయడంతో మానసిక క్షోభకు గురై సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు హాస్పిటల్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. రాము మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా విరమింపజేశారు. డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాము కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.