పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటికి వచ్చిన ఆయన కాసేపు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజగోపాల్... ఓ శుభకార్యానికి వెళుతుండగా మార్గం మధ్యలో హర్షకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వారికి మద్దతిస్తానని చెప్పారు. అవసరమైతే ఎన్నికల్లో వారి తరపున ప్రచారం చేస్తానన్నారు.
ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని సీట్లు వస్తాయని.. అంచనాలు కూడా వేయడం లేదన్నారు రాజగోపాల్. ప్రజల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ను విడిచిపెట్టాం.. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో తాము పూర్తిగా విభేదించామన్నారు. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేది.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చలా సంతోషంగా ఉందన్నారు.