అస్సాంలో కుంభవృష్టి..ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వానలు

అస్సాంలో కుంభవృష్టి..ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వానలు
  • అరుణాచల్​ప్రదేశ్, సిక్కిం, మణిపూర్​లోనూ వరదల బీభత్సం
  • ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నదులు
  • అరుణాచల్​లో 10కి చేరిన మృతుల సంఖ్య
  • సిక్కింలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు జవాన్ల మృతి
  • వరద పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆరా

ఈటానగర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. ఈ నెల 1న రికార్డు వాన అస్సాంను  ముంచెత్తింది. 24 గంటల్లోనే 41.58 సెం.మీ. వర్షపాతం నమోదైందని, గత 132 ఏళ్లలో ఇదే రికార్డని అధికారులు తెలిపారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. 

అస్సాం, అరుణాచల్​ప్రదేశ్, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లోని అన్ని నదులు, ఉపనదులు, కాలువలు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలన్నీ నీటమునిగాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. స్వల్పంగా ప్రాణనష్టం కూడా సంభవించింది.  

ఈ నేపథ్యంలో వర్షాలపై కేంద్ర సర్కారు అలర్ట్​ అయింది. అస్సాం, అరుణాచల్‌‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వ శర్మ, పెమా ఖండూ, ప్రేమ్‌‌ సింగ్‌‌ తమాంగ్, మణిపుర్‌‌ గవర్నర్‌‌ అజయ్‌‌ కుమార్‌‌ భల్లాతో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా ఆదివారం  ఫోన్‌‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.

అతలాకుతలమైన అరుణాచల్​ప్రదేశ్​

భారీ వర్షాలతో అరుణాచల్​ప్రదేశ్ అతలాకుతలమవుతున్నది. ప్రధాన నదులు, వాటి ఉపనదులు డేంజర్ లెవల్​ను మించి ప్రవహిస్తుండటంతో, రాష్ట్రంలోని పశ్చిమ కామెంగ్, కామ్లే, లోయర్, అప్పర్ సుబన్సిరి, పాపుమ్ పారే, దిబాంగ్ వ్యాలీ, లోయర్ దిబాంగ్ వ్యాలీ, లోహిత్, చాంగ్లాంగ్, క్రా దాది, కురుంగ్ కుమే, లాంగ్డింగ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. 

సోమవారం వరదల్లో చిక్కుకొని ఒకరు మృతిచెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 10కి చేరిందని అధికారులు వెల్లడించారు. 23 జిల్లాల్లోని 156 గ్రామాల్లో 938 మంది వరదల ప్రభావానికి గురయ్యారు. అప్పర్​డిగర్​లో వరదల్లో కొట్టుకుపోయిన ఒకరి మృతదేహాన్ని లోహిత్ జిల్లాలోని లాసా పాని వద్ద దిగువన వెలికితీసినట్టు చెప్పారు. సీఎం పెమా ఖండు  సంతాపం ప్రకటించారు. 

భారీ వర్షాలు కొనసాగుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను చేయవద్దని కోరారు. రాష్ట్రంలో ప్రాణనష్టంపై గవర్నర్​ లెఫ్టినెంట్​ జనరల్​ కేటీ పర్నాయక్​(రిటైర్డ్​) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

వంతెనపై వేలాడుతూ..

అరుణాచల్​ప్రదేశ్​లో నది ఉవ్వెత్తున ఉప్పొంగుతుండగా, ఒక వ్యక్తి తాడు పట్టుకుని ఎంతో కష్టం మీద  పురాతన బ్రిడ్జిని దాటుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు. ‘‘అరుణాచల్ ప్రదేశ్‌‌లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారతదేశం, చైనా, మయన్మార్ సరిహద్దుల ట్రై-జంక్షన్ సమీపంలోని అంజా జిల్లాలో ఓ వ్యక్తి  వేలాడే వంతెనను దాటుతున్న వీడియో వచ్చింది. దయచేసి జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుంది” అని పేర్కొన్నారు.

కొండచరియలు విరిగిపడి ముగ్గురు జవాన్లు మృతి..

సిక్కింను వర్షాలు కుదిపేస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఆర్మీ సిబ్బంది ముగ్గురు మృతి చెందారని, మరో ఆరుగురు గల్లంతయ్యార ని అధికారులు తెలిపారు. హవల్దార్ లఖ్వీందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీశ్​ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖాడ అనే ముగ్గురు సైనికుల మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. 

సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని,  క్లిష్ట పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బృందాలు 24 గంటలూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.  మృతులకు భారత సైన్యం సంతాపం ప్రకటించింది.  కాగా, సిక్కింలోని లాచుంగ్‌‌లో  ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. మొదటి బ్యాచ్ పర్యాటకులను రక్షించి 18 వాహనాల్లో ఫిడాంగ్‌‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. 1,678 మంది పర్యాటకులతో కూడిన మరో కాన్వాయ్ థెంగ్ చెక్ పోస్ట్ దాటి ఫిడాంగ్ వైపు వెళ్తున్నదని వెల్లడించారు.