లీడర్లకు సెల్ఫీల బుగులు..ఎవరికి ఏ నేర చరిత్ర ఉందో

లీడర్లకు సెల్ఫీల బుగులు..ఎవరికి ఏ నేర చరిత్ర ఉందో
  • లీడర్లకు సెల్ఫీల బుగులు
  • క్యాడర్​, జనంతో ఫొటోలు దిగేందుకు ఇష్టపడ్తలే
  • ఎవరికి ఏ నేర చరిత్ర ఉందో తెలియని పరిస్థితి
  • ఇలాంటి ఫొటోల వల్ల చిక్కుల్లో పడ్తామని భయం
  • ఎమ్మెల్యేల కొనుగోలు, టీఎస్​పీఎస్సీ, టెన్త్​ పేపర్ల లీకేజీ కేసుల్లో కలకలం రేపిన నిందితుల పాత ఫొటోలు
  • నిందితుడు ‘మీ వాడంటే మీ వాడు’ అంటూ
  • పోటాపోటీగా ఫొటోలు రిలీజ్​చేసిన అధికార, ప్రతిపక్షాలు
  • తాజా ఘటనలతో సెల్ఫీలకు దూరంగా ఉంటున్న నేతలు

నెట్​వర్క్, వెలుగు: క్యాడర్​తో, కామన్​ పబ్లిక్​తో సెల్ఫీలు దిగేందుకు లీడర్లు జంకుతున్నారు. పార్టీ మీటింగులు, అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, పరామర్శలకు వెళ్లినప్పుడు లీడర్లతో చాలామంది సెల్ఫీలు తీసుకోవడం ఇటీవలి కాలంలో ట్రెండ్​గా మారింది. మొహమాటానికో, రాజకీయంగా ఉపయోగపడుతుందనో సెల్ఫీలకు ఒప్పుకుంటున్న లీడర్లు.. ఆ తర్వాత చిక్కుల్లో పడ్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. నేతలతో ఫొటోలు దిగుతున్న వారిలో ఎవరికి ఏ నేర చరిత్ర ఉందో తెలియడం లేదు. అలాంటివాళ్లు పోలీసులకు చిక్కినప్పుడు లీడర్ల పేర్లు బయటకు వస్తుండడంతో సోషల్​ మీడియాలో ట్రోల్​ అవుతున్నారు.

వరుసగా ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు, టెన్త్​ పేపర్​లీకేజీ  కేసులో నిందితులు.. గతంలో మంత్రులు, ప్రతిపక్ష లీడర్లతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయా లీడర్లు విపరీతంగా ట్రోల్​అయ్యారు. ‘‘నిందితుడు మీవాడేనంటే.. కాదు మీవాడే..’’ అంటూ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇటీవల ఆదిలాబాద్​ జిల్లాలో సెల్ఫీ కారణంగా బీజేపీ యువనేతను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది.


పోటాపోటీగా ఫొటోలు రిలీజ్


మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో నలుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో స్వామీజీలు రామచంద్రభారతి,  సింహయాజితో పాటు పాల్గొన్న నందకుమార్ కు బీజేపీ సీనియర్​ లీడర్లతో సంబంధాలున్నాయంటూ  బీఆర్​ఎస్​ లీడర్లు ఆరోపించారు. బీజేపీ లీడర్లతో నందకుమార్​ దిగినప్పటి ఫొటోలను వాళ్లు రిలీజ్​ చేశారు. వ్యాపారవేత్త అయిన నందకుమార్​ చాలామందితో ఫొటోలు దిగాడంటూ ఆయన బీఆర్​ఎస్​ లీడర్లతో ఉన్న ఫొటోలను బీజేపీ నేతలు బయటపెట్టారు. ఆ తర్వాత టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీలో నిందితుడు రాజశేఖర్​రెడ్డి బీజేపీ సోషల్​ మీడియాలో పని చేశాడంటూ బీఆర్​ఎస్​ నేతలు ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న రాజశేఖరరెడ్డి ఫొటో ను బయటపెట్టారు. దీన్ని బీజేపీ తిప్పికొట్టింది. కాం ట్రాక్ట్​ పద్ధతిలో రాజశేఖర్​రెడ్డిని టీఎస్​పీఎస్సీలో నియ మించింది కేటీఆర్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖేనని కౌంటర్​ ఇచ్చింది. ఆ తర్వాత టెన్త్​ పేపర్ల లీకేజీలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ప్రశాంత్​ బండి సంజయ్​కు అనుచరుడని, బీజేపీ సోషల్​ మీడియా విభాగంలో పనిచేస్తున్నాడని బీఆర్​ఎస్​ ఆరోపించింది. బీజేపీ లీడర్లతో ప్రశాంత్​ ఉన్న ఫొటోలను రిలీజ్​చేసింది. ​రిపోర్టర్​గా పని చేసిన ప్రశాంత్​కు  వరంగల్​ జిల్లా 
లీడర్లతో సంబంధాలున్నాయంటూ ఆయన బీఆర్​ఎస్ ​​లీడర్లు వినయ్​భాస్కర్​ తదితరులతో దిగిన ఫొటోలను బీజేపీ బయటపెట్టింది. 


ఆదిలాబాద్​ జిల్లాలో కేసుల దాకా.. 


ఆదిలాబాద్​ జిల్లాలో లీడర్లతో కార్యకర్తలు దిగిన సెల్ఫీలు వివాదాస్పదంగా మారి పోలీస్ ​కేసుల దాకా వెళ్లింది. ఈ నెల14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్​ టౌన్​లో నిర్వహించిన ర్యాలీలో అల్లరి మూకలు ఓ యువకుడిపై దాడి చేశాయి. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసు పెట్టారు. నిందితుల్లో ఒకరు బీజేపీ కార్యకర్త అంటూ బీఆర్ఎస్ వాళ్లు, కాదు వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలే అంటూ బీజేపీ లీడర్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడితో బీజేపీ యువనేత పాయల్​ శరత్ ​దిగిన సెల్ఫీ ఫొటోను పోలీసులు బయటపెట్టారు. దీనిపై శరత్​ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనను బద్నాం చేస్తున్నారని ఆరోపిస్తూ శరత్​పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం, బీజేపీ లీడర్లు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


షేక్​ హ్యాండ్​ వరకు ఓకే..!


సెల్ఫీల వివాదాలకు దారితీస్తున్నందున క్యాడర్​, కామన్​ పబ్లిక్​తో ఫొటోలకు లీడర్లు ససేమిరా అంటున్నారు. తాజాగా జరుగుతున్న బీఆర్ఎస్​ ఆత్మీయ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. కార్యకర్తలతో సెల్ఫీలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీ మీటింగుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని నేతలు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ ఆత్మీయ సమావేశంలో తనతో ఫొటో దిగేందుకు వచ్చిన ఓ కార్యకర్తలతో ‘షేక్​హ్యాండ్​వరకు ఓకే.. కానీ నో సెల్ఫీ ప్లీజ్​’ అంటూ ఓ మంత్రి రెక్వెస్ట్​ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.