
- లీడర్లకు సెల్ఫీల బుగులు
- క్యాడర్, జనంతో ఫొటోలు దిగేందుకు ఇష్టపడ్తలే
- ఎవరికి ఏ నేర చరిత్ర ఉందో తెలియని పరిస్థితి
- ఇలాంటి ఫొటోల వల్ల చిక్కుల్లో పడ్తామని భయం
- ఎమ్మెల్యేల కొనుగోలు, టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ల లీకేజీ కేసుల్లో కలకలం రేపిన నిందితుల పాత ఫొటోలు
- నిందితుడు ‘మీ వాడంటే మీ వాడు’ అంటూ
- పోటాపోటీగా ఫొటోలు రిలీజ్చేసిన అధికార, ప్రతిపక్షాలు
- తాజా ఘటనలతో సెల్ఫీలకు దూరంగా ఉంటున్న నేతలు
నెట్వర్క్, వెలుగు: క్యాడర్తో, కామన్ పబ్లిక్తో సెల్ఫీలు దిగేందుకు లీడర్లు జంకుతున్నారు. పార్టీ మీటింగులు, అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, పరామర్శలకు వెళ్లినప్పుడు లీడర్లతో చాలామంది సెల్ఫీలు తీసుకోవడం ఇటీవలి కాలంలో ట్రెండ్గా మారింది. మొహమాటానికో, రాజకీయంగా ఉపయోగపడుతుందనో సెల్ఫీలకు ఒప్పుకుంటున్న లీడర్లు.. ఆ తర్వాత చిక్కుల్లో పడ్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. నేతలతో ఫొటోలు దిగుతున్న వారిలో ఎవరికి ఏ నేర చరిత్ర ఉందో తెలియడం లేదు. అలాంటివాళ్లు పోలీసులకు చిక్కినప్పుడు లీడర్ల పేర్లు బయటకు వస్తుండడంతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.
వరుసగా ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు, టెన్త్ పేపర్లీకేజీ కేసులో నిందితులు.. గతంలో మంత్రులు, ప్రతిపక్ష లీడర్లతో దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయా లీడర్లు విపరీతంగా ట్రోల్అయ్యారు. ‘‘నిందితుడు మీవాడేనంటే.. కాదు మీవాడే..’’ అంటూ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో సెల్ఫీ కారణంగా బీజేపీ యువనేతను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది.
పోటాపోటీగా ఫొటోలు రిలీజ్
మొయినాబాద్ ఫామ్హౌస్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో స్వామీజీలు రామచంద్రభారతి, సింహయాజితో పాటు పాల్గొన్న నందకుమార్ కు బీజేపీ సీనియర్ లీడర్లతో సంబంధాలున్నాయంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు. బీజేపీ లీడర్లతో నందకుమార్ దిగినప్పటి ఫొటోలను వాళ్లు రిలీజ్ చేశారు. వ్యాపారవేత్త అయిన నందకుమార్ చాలామందితో ఫొటోలు దిగాడంటూ ఆయన బీఆర్ఎస్ లీడర్లతో ఉన్న ఫొటోలను బీజేపీ నేతలు బయటపెట్టారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ సోషల్ మీడియాలో పని చేశాడంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న రాజశేఖరరెడ్డి ఫొటో ను బయటపెట్టారు. దీన్ని బీజేపీ తిప్పికొట్టింది. కాం ట్రాక్ట్ పద్ధతిలో రాజశేఖర్రెడ్డిని టీఎస్పీఎస్సీలో నియ మించింది కేటీఆర్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖేనని కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత టెన్త్ పేపర్ల లీకేజీలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ప్రశాంత్ బండి సంజయ్కు అనుచరుడని, బీజేపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ ఆరోపించింది. బీజేపీ లీడర్లతో ప్రశాంత్ ఉన్న ఫొటోలను రిలీజ్చేసింది. రిపోర్టర్గా పని చేసిన ప్రశాంత్కు వరంగల్ జిల్లా
లీడర్లతో సంబంధాలున్నాయంటూ ఆయన బీఆర్ఎస్ లీడర్లు వినయ్భాస్కర్ తదితరులతో దిగిన ఫొటోలను బీజేపీ బయటపెట్టింది.
ఆదిలాబాద్ జిల్లాలో కేసుల దాకా..
ఆదిలాబాద్ జిల్లాలో లీడర్లతో కార్యకర్తలు దిగిన సెల్ఫీలు వివాదాస్పదంగా మారి పోలీస్ కేసుల దాకా వెళ్లింది. ఈ నెల14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ టౌన్లో నిర్వహించిన ర్యాలీలో అల్లరి మూకలు ఓ యువకుడిపై దాడి చేశాయి. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసు పెట్టారు. నిందితుల్లో ఒకరు బీజేపీ కార్యకర్త అంటూ బీఆర్ఎస్ వాళ్లు, కాదు వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలే అంటూ బీజేపీ లీడర్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడితో బీజేపీ యువనేత పాయల్ శరత్ దిగిన సెల్ఫీ ఫొటోను పోలీసులు బయటపెట్టారు. దీనిపై శరత్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనను బద్నాం చేస్తున్నారని ఆరోపిస్తూ శరత్పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం, బీజేపీ లీడర్లు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
షేక్ హ్యాండ్ వరకు ఓకే..!
సెల్ఫీల వివాదాలకు దారితీస్తున్నందున క్యాడర్, కామన్ పబ్లిక్తో ఫొటోలకు లీడర్లు ససేమిరా అంటున్నారు. తాజాగా జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. కార్యకర్తలతో సెల్ఫీలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని నేతలు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ ఆత్మీయ సమావేశంలో తనతో ఫొటో దిగేందుకు వచ్చిన ఓ కార్యకర్తలతో ‘షేక్హ్యాండ్వరకు ఓకే.. కానీ నో సెల్ఫీ ప్లీజ్’ అంటూ ఓ మంత్రి రెక్వెస్ట్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.