- మూడు గ్యాంగ్లు.. 100 మందికి సేల్
- తాజాగా మరో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్,వెలుగు: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతున్నది. గ్యాంగ్లుగా ఏర్పడి పేపర్స్ సేల్ చేసినట్లు వెల్లడైంది. ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా లీకైన పేపర్స్ మూడు ముఠాల నుంచి 100 మందికి పైగా చేరినట్లు సిట్ గుర్తించింది. అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పేపర్ కొనుగోలు చేసిన మరో ముగ్గురిని సిట్ గురువారం అదుపులోకి తీసుకుంది. ఉప్పల్కు చెందిన భరత్నాయక్, వరంగల్కు చెందిన పసికంటి రోహిత్ కుమార్, గాదె సాయి మధును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. వీరితో ఈ కేసులో నిందితుల సంఖ్య43కు చేరింది. న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్ మినహా మిగితా 42 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు మీడియేటర్ పూల రవికిశోర్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేశారు. రూ.3 లక్షలకు డీల్ కు కుదుర్చుకుని రూ.లక్ష చొప్పున చెల్లించారు. ఈ కేసులో 11వ నిందితుడుగా ఉన్న సురేశ్ నుంచి నల్లగొండ జిల్లా నకిరేకల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రవికిశోర్ ఏఈ, డీఏవో పేపర్స్ కొనుగోలు చేశాడు.
ఒకరి నుంచి ఒకరికి
టీఎస్పీఎస్సీ పేపర్స్ మూడు గ్యాంగ్ల నుంచి దాదాపు 100 మందికి పైగా చేరినట్లు సిట్ గుర్తించింది. టీఎస్పీఎస్సీలో టెక్నీషియన్గా పనిచేసిన సురేశ్ ఏఈ, డీఏవో పేపర్స్ను అంగట్లో సరుకులా అమ్మేశాడు. రేణుక, ఆమె భర్త ఢాక్యనాయక్, దళారులు మురళీధర్రెడ్డి, మనోజ్ల ద్వార ఏఈ పేపర్స్ విక్రయించారు. ప్రవీణ్ వద్ద డీఏవో పేపర్ కొనుగోలు చేసిన ఖమ్మంకు చెందిన సుస్మిత, సాయి లౌకిక్ నుంచి బెంగళూర్లోని సాఫ్ట్వేర్ ఎంప్లాయి రవితేజ రూ.15 లక్షలకు పేపర్ కొనుగోలు చేశాడు.
టెక్నీషియన్ సురేశ్ పేపర్ సేల్స్
టీఎస్పీఎస్సీలో ఔట్సోర్సింగ్ టెక్నీషియన్గా పనిచేసిన సురేశ్ మరో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఏఈ, ఏఈఈ, డీఏవో పేపర్స్ అంగట్లో సరుకులా అమ్మేశాడు. జనగాం జిల్లా తరిగొప్పుల మండలం పోతారం గ్రామానికి చెందిన నలగొప్పుల సురేశ్ గతంలో టీఎస్ పీఎస్సీలో టెక్నీషియన్గా పనిచేశాడు. నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేశ్తో సురేశ్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తరువాత గ్రూప్1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ప్రవీణ్కుమార్ నుంచి గ్రూప్1 ప్రిలిమినరీ పేపర్ను సేకరించాడు. ఈ పరీక్షలో 120 మార్కులు సాధించాడు. గ్రూప్ 1 సక్సెస్ కావడంతో ప్రవీణ్ వద్ద ఉన్న మరో ఆరు పేపర్స్ను సేల్ చేసేందుకు ప్లాన్ చేశారు.