
- ఇరాన్పై బాంబుల దాడి సరికాదు
బషీర్బాగ్, వెలుగు: అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను మూడో ప్రపంచ యుద్ధం వైపు ఉసిగొల్పుతోందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా బాంబుల దాడిని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తా వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ దేశాలకు బిగ్ బాస్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహించిన ట్రంప్ ఇటీవల పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి చేసేలా పురిగొల్పాలరన్నారు.
తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాన్ని ప్రోత్సాహించి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించడం దుర్మార్గమన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యాలు అపరేషన్ సిందూర్ చేపడితే ట్రంప్ భారత్ కు మద్దతు పలికి రెండు రోజుల్లోనే పాకిస్తాన్ వంత పాడారన్నారు. భారత ప్రధానిగా అమెరికా యుద్ధ కాంక్షకు వ్యతిరేకంగా మోదీ తన గళాన్ని వినిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్.బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి, డీజీ.నరసింహా రావు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.గోవర్ధన్, సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హనుమేశ్, సూర్యం, ఎస్ ఎల్.పద్మ, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గాధగోని రవి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేశ్రాజా, ఎస్ యూసీఐ(సి)రాష్ట్ర కార్యదర్శి మురహరి పాల్గొన్నారు.