అస్సాంలోని గౌహతిలో ఓ చిరుతను స్థానికులు కొట్టి చంపేయడమే కాకుండా… దాన్ని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చిరుతను చంపారన్న విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన మిగతావారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నిన్న(ఆదివారం) ఉదయం ఆ చిరుత తమ గ్రామంలోకి ప్రవేశించడంతో అది తమపై దాడి చేస్తుందన్న భయంతో స్థానికులు ఈ ఘటనకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసినప్పటికీ వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. అధికారులు చిరుతను పట్టుకోవడంలో ఆలస్యం చేశారని, అందుకే దాని మీద భయంతో ఈ పని చేశామంటున్నారు గ్రామస్థులు.
గత కొద్ది రోజులుగా అడవి జంతువులు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులులు తరుచూ గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు భయాంధోళనకు గురవుతున్నారు.