భారత్​ సూపర్ ​పవర్​గా ఎదగాలె : వెంకయ్య నాయుడు

భారత్​ సూపర్ ​పవర్​గా ఎదగాలె : వెంకయ్య నాయుడు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​లోని స్వర్ణ భారత్ ట్రస్టులో మంగళవారం ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి ఉగాది సంబరాలను ప్రారంభించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. భారత్ త్వరలోనే సూపర్ పవర్ గా ఎదగాలని, దీని కోసం ప్రతి ఒక్కరు తమవంతు కృషిని నిర్వర్తించాలని సూచించారు. భారత్ ప్రబల శక్తిగా అవతరించడానికి ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని అన్నారు. గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాదిని తమిళనాడులోనూ జరుపుకుంటారని.. అయితే కొత్త సంవత్సరంలా కాదని, ఆ రోజు గ్రామ దేవతలను పూజించి తీర్థం తీసుకుంటారని చెప్పారు. అనంతరం పండితులు పంచాంగ శ్రవణం చేశారు. తర్వాత స్వర్ణభారత్ ట్రస్టులో పలు అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ చిగురుపాటి కృష్ణప్రసాద్ ట్రస్ట్ సాధించిన ఫలితాలను వివరించారు.