హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ హైదరాబాద్ ఆఫీస్ (ఇండియా సౌత్ సెంట్రల్ జోన్)లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కలిసి పనిచేయడం, నిజాయితీ, అంకితభావం అవసరమని పేర్కొన్నారు. ఎల్ఐసీలో టెక్నాలజీ వాడకం పెరిగిందని, పాలసీహోల్డర్లకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని అన్నారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. “మై ఎల్ఐసీ, మై కంట్రీ, మై ఎర్త్’’ అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని, మేకిన్ ఇండియా భావనను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు పి. పి. కేల్కర్, ఎం. రవికుమార్, శరవణ రమేష్, జి.ఎస్. శాస్త్రి, ఏ.ఏ.ఎం. హిలాలి, జోనల్, డివిజనల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్ఎండీసీ ఆఫీసులో..
మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ రిపబ్లిక్ డే వేడుకలను హైదరాబాద్ ఆఫీసులో నిర్వహించింది. కంపెనీ సీఎండీ అమితావ ముఖర్జీ జెండా ఆవిష్కరించారు. బాధ్యతాయుతమైన మైనింగ్లో ఎన్ఎండీసీ గ్లోబల్ బెంచ్మార్క్గా ఎదుగుతోందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
