లాక్ డౌన్ లో లిక్క‌ర్ షాపులు ఓపెన్.. ఒకేసారి రూ.95 వేలకు కొనేశాడు!

లాక్ డౌన్ లో లిక్క‌ర్ షాపులు ఓపెన్.. ఒకేసారి రూ.95 వేలకు కొనేశాడు!

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల మూత ప‌డిన లిక్క‌ర్ షాపులు కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో.. దాదాపు 40 రోజుల త‌ర్వాత సోమ‌వారం ఓపెన్ అయ్యాయి. ఇన్ని రోజులుగా ఆల్క‌హాల్ కు దూర‌మైన మ‌ద్యం ప్రియులు ఒక్కోషాపు ద‌గ్గ‌ర వంద‌ల సంఖ్య‌లో బారులుతీరారు. క‌ర్ణాట‌కలో షాపులు తెరిచిన తొలి రోజే భారీగా రూ.45 కోట్ల సేల్స్ జ‌రిగిన‌ట్లుగా ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిన్న ఆ రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో ఏ రేంజ్ లో లిక్క‌ర్ సేల్స్ జ‌రిగాయే చెప్పే రెండు బిల్లులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ క్యూల్లో నిల‌బ‌డ‌డం క‌ష్టం అనుకున్నారో లేక లాక్ డౌన్ టైమ్ లో షాపుల్లో స్టాక్ అయిపోతే ఇక ఇప్పుడ‌ప్పుడే దొర‌క‌ద‌ని భావించారో ఏమో కానీ ఓ వ్య‌క్తి రూ.52 వేలు, మ‌రో వ్య‌క్తి రూ.95 వేల‌కు లిక్క‌ర్ కొనేశారు.

బెంగ‌ళూరులోని వెనిలా స్పిరిట్ జోన్ అనే లిక్క‌ర్ మాల్ లో సోమ‌వారం ఓ వ్య‌క్తి రూ.52,841కు మ‌ద్యం కొన్నాడు. దీనికి సంబంధించిన బిల్లును అభిషేక్ అనే ఒక నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఎవ‌రో త‌న నెల శాల‌రీ మొత్తాన్ని ఇవాళే ఖ‌ర్చు పెట్టేశాడ‌న్న క్యాప్ష‌న్ తో దాన్ని పోస్ట్ చేశాడు. అలాగే మ‌రో వ్య‌క్తి రూ.95,347కు లిక్క‌ర్ బాటిల్స్ కొన్నాడు. ఇది బెంగ‌ళూరులోని డాల‌ర్స్ కాల‌నీలోని వైన్ షాపులో కొనుగోలు చేసిన మ‌ద్యం బిల్లు. రాజేశ్వ‌ర్ రెడ్డి అనే నెటిజ‌న్ ఈ బిల్లును ట్వీట్ చేశాడు. వ‌న్ మోర్ అనే క్యాప్ష‌న్ తో దీనిని పోస్ట్ చేశాడు.

షాపింగ్ మాల్స్ లో దుస్తులు కొన‌డానికో, నిత్యావ‌స‌రాలు కొన‌డానికో ట్రాలీని వాడిన‌ట్లుగా లిక్క‌ర్ స్టోర్స్ లో భారీగా స్టాక్ కొన్నారు ఈ మ‌ద్యం ప్రియులు. ఈ బిల్లుల‌ను చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. వామ్మో ఇంత బిల్ ఎలా అని కొంద‌రు, ఓ చిన్న‌పాటి షాప్ పెట్టేయొచ్చ‌ని మ‌రికొంద‌రు, అస‌లు ఇంత స్టాక్ ఇంటికి ఎలా తీసుకెళ్లాడ‌బ్బా అంటూ కొంత మంది నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.