
- ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని మరీ డిపాజిట్ల సేకరణ
- ఎక్కువ వడ్డీ వస్తుండడంతో ఆశపడి మోసపోయిన జనం
- ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు
- రూ. 500 కోట్లకు పైగా సేకరించినట్లు ప్రచారం
నల్గొండ, వెలుగు : వందకు రూ. 10 నుంచి 20 రూపాయల వడ్డీ ఇస్తానంటూ ఓ వ్యక్తి వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారం నల్లొండ జిల్లాలో కలకలం రేపుతోంది. అతడిని నమ్మిన చాలా మంది తమ సొంత నగదుతో పాటు, బంగారం తాకట్టు పెట్టి, బయట అప్పులు తీసుకొచ్చి మరీ డబ్బులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి ఇటీవల గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
ఏజెంట్లను నియమించుకొని దందా..
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ, రవినాయక్ కలిసి జిల్లా వ్యాప్తంగా కొందరిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారి ద్వారా రూ. 10 నుంచి రూ. 20 వడ్డీ ఇస్తామంటూ ప్రచారం చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. అప్పులు ఇచ్చిన వారికి వడ్డీ సక్రమంగా చెల్లిస్తుండడంతో పలువురు వ్యక్తులు తమ భూములు, బంగారాన్ని తాకట్టు పెట్టి, బయట రూ. 3 వడ్డీకి అప్పులు తెచ్చి మరీ వీరికి డబ్బులు ఇచ్చారు.
ఇలా దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ, పీఏపల్లి, చందంపేట, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలాల్లోని వేలాది మంది గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి సేకరించిన పైసలకు సదరు వ్యక్తులు వారికి ఎలాంటి హామీ పత్రాలు గానీ, ప్రామిసరీ నోట్లు గానీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు మొదలుకుని రూ.10 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. రెండు, మూడేళ్ల కింద పీఏపల్లి మండలంలో మొదలైన ఈ దందా నల్గొండ జిల్లా మొత్తానికి పాకినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏజెంట్లకు రూ. 2 కోట్లు ఇప్పిస్తే కారు, రూ. కోటి ఇప్పిస్తే బైక్ గిఫ్ట్
ప్రజల నుంచి అప్పులు ఇప్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో అప్పులు ఇప్పించిన ఏజెంట్లకు ఖరీదైన బహుమతులు ఇస్తామని ఆశ పెట్టారు. ఇందులో భాగంగా రూ.2 కోట్లు అప్పుగా ఇప్పించిన వ్యక్తికి కారు, రూ. కోటి ఇప్పించిన ఏజెంట్లకు బైక్లు గిఫ్ట్గా ఇచ్చారు. ప్రజల నుంచి అప్పులు తీసుకున్న సదరు వ్యక్తులు లగ్జరీ కార్లతో తిరుగుతూ, విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతూ, హైదరాబాద్లో విల్లాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కలెక్టర్కు ఫిర్యాదుతో వెలుగులోకి...
పీఏపల్లి మండలంలోని వద్దిపట్ల పలుగుతండాల్లో అధిక వడ్డీ ఆశతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేయాలని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 16న నల్గొండ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపించి ఎలాంటి హామీ పత్రాలు లేకుండా, మధ్యవర్తి ద్వారా వేలాది మంది నుంచి కోట్లకొద్దీ వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలాజీ, రవినాయక్తో పాటు కొందరు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి రూ. 500 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు దందా జరిగినట్లు అనుమానిస్తున్నారు.