బైక్పై ఇద్దరు, ముగ్గురు వెళ్తే కేసులు నమోదు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇంట్లోనే ఉండేలా చూడాలని, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ‘టెలీ మెడిసిన్’ కంట్రోల్ రూమ్ నెంబర్ 08542 226670 కు కాల్ చేసి చేయాలన్నారు. జిల్లాలో 3 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని, సిబ్బంది ఇంటికే వచ్చి మందులు ఇస్తారని చెప్పారు. మండలాల్లో లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా కేసులు లేవని, కూలీలకు పనులు కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీవో, తహసీల్దార్. ఏపీవో, అగ్రికల్చర్ అఫీసర్లు మండలాన్ని నాలుగు భాగాలుగా విభజించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
హాట్స్పాట్లలో అలర్ట్ గా ఉండండి
హాట్ స్పాట్ ఏరియాలో అలర్ట్ గా ఉండాలని, ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని సద్దలగుండు ప్రాంతంలో పర్యటించారు. మొబైల్ వాహనాల ద్వారా కూరగాయాలు, నిత్యావసర సరుకులు వస్తున్నాయా అని కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బైక్పై వెళ్తున్న వారిని ఆపి కారణాలు అడిగారు.
ఫైరింజన్, డ్రోన్ సాయంతో స్ప్రే
హట్ స్పాట్ ప్రాంతాల్లో అధికారులు ప్రతిరోజూ శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని రోడ్లు, ఇండ్ల పరిసర ప్రాంతాల్లో స్ప్రే చేస్తున్నారు. సోమవారం ఫైరింజన్, డ్రోన్ సాయంతో పిచికారీ చేశారు.