సత్తా చాటిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు.. గరుడకు జాతీయ స్థాయిలో అవార్డులు

సత్తా చాటిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు.. గరుడకు జాతీయ స్థాయిలో అవార్డులు

ఆదిలాబాద్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఈ గరుడ వాహనానికి  అవార్డులు దక్కాయి.  సాధారణ వాహనాలు వెళ్లలేని కొండ ప్రాంతాలు, సరైన రహదారులు లేని దుర్భర పరిస్థితుల్లో కూడా గరుడ అత్యంత వేగంగా దూసుకుపోతుంది. దారులు లేని చోట కూడా తన గమ్యాన్ని చేరుకోవడమే ఈ వాహనం ప్రత్యేకత.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణకు అవార్డుల పంట పండుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కాలేజ్ పోటీల్లో గరుడ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.  అంతేకాకుండా అహ్మదాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ATVC 2026 ఛాంపియన్‌షిప్‌లో గరుడ వాహనం విజేతగా నిలిచింది.ఈ ఛాంపియన్‌షిప్ కోసం దేశవ్యాప్తంగా 43 జట్లు పోటీపడగా గరుడ వేగాన్ని అందుకోవడంలో ఇతర వాహనాలన్నీ వెనకబడిపోయాయి. 

గరుడ చూపిన అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచి బాసర కీర్తిని దశదిశలా చాటింది. ఈ ఘనత సాధించిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందాన్ని బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల మేధస్సుకు, పట్టుదలకు ఈ గరుడ విజయం ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.