తనపై సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న విమర్శలపై స్పందించాడు నిత్యానంద. ప్రేమను ప్రేమతోనే గెలవాలని, వీలైనంత వరకూ ప్రేమను నలుమూలలా విస్తరించాలని తనదైన శైలిలో నీతి సూక్తులు వల్లించాడు. ఇంతకీ ఏందుకీ సందేశమంటారా..?
రేప్ కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద భారత్ నుంచి పరారై… దక్షిణ అమెరికా వెళ్లాడు. అక్కడ కంట్రీ ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసినట్టు సమాచారం. దానికి కైలాసం అనే పేరు పెట్టి, హిందు మతాన్ని స్వేచ్ఛగా ఆచరించాలనుకునే వాళ్లు ఆ దేశంలోకి రావొచ్చని.. అందర్నీ ఆహ్వానిస్తున్నాడు. అందుకోసం kailaasa.org అనే ఓ వెబ్సైట్ లో రిజస్టర్ చేసుకునేందుకు ఓ లింక్ ని కూడా జత చేశాడు.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇలా నీతి బోధలు చేయడమేంటి అని ప్రశ్నలు వేశారు. ‘నీ దేశానికి రావాలంటే వీసా ప్రొసీజర్ ఏంటీ? అక్కడ పెట్టుబడులు పెడితే ఏవైనా బెనిఫిట్స్ ఉంటాయా’ అంటూ ఓ క్రికెటర్ కూడా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు.
వీటిపై స్పందించిన నిత్యానంద.. “నేనొక దేశం సృష్టించానని తెలిసి భారతదేశంలో చాలా మంది అసూయ పడతున్నారు. నేనేమీ నాకోసం ప్రత్యేకంగా ఆ దేశాన్ని సృష్టించలేదు. హిందు మతం కోసం పోరాడే పోరాటంలో భాగంగా ఆ దేశాన్ని సృష్టించడం జరిగింది. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పినట్టు.. ప్రేమను ప్రేమతోనే గెలవాలి. ప్రేమను లోకమంతా విస్తరించాలి. ప్రేమ మాత్రమే హృదయాల్ని గెలవగలదు.” అని ట్విటర్ లో ట్వీట్ లు చేశాడు. తల్లి మీనాక్షి దయ తన కైలాసంపై ఉంటుందని అన్నాడు.