న్యూఢిల్లీ: జేఎస్డబ్ల్యూ స్టీల్ నుంచి రూ.10–15 వేల కోట్ల విలువైన మెగా ఆర్డర్ను దక్కించుకున్నామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎల్ అండ్ టీ ప్రకటించింది. దేశీయ మెటల్ రంగంలో కంపెనీకి లభించిన అతిపెద్ద ఆర్డర్ ఇదే కావడం విశేషం. జేఎస్డబ్ల్యూ తన క్రూడ్ స్టీల్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35 మిలియన్ టన్స్ పర్ యానమ్(ఎంటీపీఏ) నుంచి 2031 నాటికి 50 ఎంటీపీఏకి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా కర్ణాటకలోని బళ్లారి, ఒడిశాలోని పారాదీప్ ప్రాంతాల్లో బ్లాస్ట్ ఫర్నేసులు, స్టీల్ మెల్ట్ షాపులు వంటి కీలక సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఎల్ అండ్ టీ చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.
