నీటిలోని పడి చచ్చేటట్లు ఉంది.. మద్రాస్ హైకోర్టు

నీటిలోని పడి చచ్చేటట్లు ఉంది.. మద్రాస్ హైకోర్టు

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో చెన్నైనగరమంతా వాన నీటిలో మునిగి తేలాడుతుంది. ఈ క్రమంలో చెన్నై నగర పాలక సంస్థపై మండిపడింది మద్రాస్ హైకోర్టు. చెరువులు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. 2015 వరదల నుంచి అధికారులు ఏం చేస్తున్నారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అప్పట్నుంచి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులు రాలేదా ? అని నిలదీసింది. ఏడాదిలో సగం రోజులు నీటలో నాని మరో సగం రోజులు ఆ నీటిలో మునిగి చచ్చేలా ఉందని కోర్టు తీవ్రంగా పేర్కొంది. ఈ పరిస్థితి మారకుంటే సుమోటోగా కేసును స్వీకరిస్తామని నగర పాలక సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. చెరువుల ఆక్రమణపై దృష్టిపెట్టాలని సూచించింది.

రాష్ట్రంలో ప్రజా రహదారులు తగినంత విశాలంగా ఉండేలా తమిళనాడు ప్రభుత్వానికి సూచనలు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టీస్ సాంజీబ్ బెనర్జీ చెన్నై కార్పొరేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలో ప్రస్తుత వర్షాలు, వరదలను ప్రభుత్వ అధికారులు గుణపాఠంగా తీసుకోవాలన్నారు. చెరువులు, నీటికుంటలు ఆక్రమణకు ప్రయత్నించేవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులను ఆక్రమించుకుంటున్నారంటూ దాఖలైన మరో పిల్‌పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు అంక్షితలు వేసింది.

చెన్నైతో పాటు చెంగల్‌పేట్, కాంచీపురం తిరువల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. శనివారం భారీ స్థాయిలో కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు.. బైలైన్స్‌లో భారీగా వాన నీరు చేరింది. దీంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కల్గింది. వానల కారణంగా ఐదుగురు మృతిచెందారు. వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా  260 గుడిసెలు, 70 ఇళ్లు ధ్వంసం అయ్యయి.  వరద సహాయక చర్యల కోసం చెన్నై కార్పొరేషణ్ అధికారులు మొత్తం 23వేల సిబ్బందిని రంగంలోకి దిగింది.