బాల కార్మికులకు స్కూల్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. ఉచితంగా విద్యనందిస్తూ విద్యార్థులకు కావాల్సిన అవసరాలను తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు . ఓడిశా నుంచి వచ్చి ఇటుక బట్టీలలో పని చేస్తున్న బాల కార్మికులకు వారి మాతృ భాషలో విద్యనందిస్తున్నారు మహేష్ భగవత్.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒడిశా నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు ఇటుక బట్టీలలో పనిచేస్తున్నాయి. వారిలో ఎక్కవగా బాలకార్మికులే ఉన్నారు. తన కమిషనరేట్ పరిధిలో బాల కార్మికులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో మహేష్ భగవత్ పిల్లల తల్లిదండ్రులకు, ఇటుక బట్టి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మూడేళ్ల క్రితం వర్క్ సైట్ స్కూల్స్ ఓపెన్ చేశారు.
ఒడిశా నుంచి టీచర్లను రప్పించి వారికి ఉచితంగా మాతృభాషలో విద్యనందిస్తున్నారు. ఈ స్కూల్ లో దాదాపు 3 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పిల్లలకు కావాల్సిన బుక్స్, స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్ పోలీస్ శాఖ, విద్యాశాఖ పలు స్వచ్చంద సంస్థల సహకారంతో అందిస్తున్నారు. ఇవాళ విద్యార్థులకు చెప్పులను పంపిణీ చేశారు మహేష్ భగవత్.