30 గ‌జాల భూమి కోసం త‌మ్ముడిని చంపిన అన్న‌

30 గ‌జాల భూమి కోసం త‌మ్ముడిని చంపిన అన్న‌

సంగారెడ్డి: త‌మ్ముడి ఆస్తి మీద క‌న్నేసి, అందుకు అడ్డుగా ఉన్నాడ‌ని అత‌న్ని నిర్ధాక్ష‌ణ్యంగా చంపాడు ఓ దుర్మార్గ‌పు అన్న. త‌న స్నేహితుల‌తో క‌ల‌సి ప్లాన్ ప్ర‌కారం అత‌నిపై విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తుల‌తో దాడి చేసి చంపాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో ఆ అన్న‌తో పాటు మ‌రో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.

పటాన్‌చెరువు డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని మల్లంపేట్ గ్రామానికి చెందిన‌ వెంకటేష్ కు నలుగురు అన్నదమ్ములు. అందులో ఇద్దరు చనిపోగా, ఇంటికి సంబంధించిన ఆస్తులను ఎవరికి వారు పంచుకున్నారు. కాగా తనకు రావలసిన 90 గజాల స్థలం లో తన పెద్దన్నయ్య యాదగిరి 30 గజాలు ఆక్రమించాడు. ఈ విష‌యంలో ఇద్దరికీ మాటా మాటా పెరగడంతో ఇరువురు కొట్టుకోవడం జరిగింది.

దీంతో వెంకటేష్ ను ఎలాగైనా హత్య చేయాలని పన్నాగం వేసిన యాదగిరి, తన స్నేహితులతో కలిసి లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని తన తమ్ముడిని చంపాలని ప్లాన్ చేశాడు. ఐదుగురు కలిసి గత నెల 11వ తేదీన ఆటో న‌డుపుతున్న వెంకటేష్ ఆటో స్టాండ్ కి వెళ్లి, పలుగు పోచమ్మ కు వెళ్దామని కిరాయి కుదుర్చుకున్నారు. యాదగిరి ఇచ్చిన పైసలతో మద్యం తాగి తిరిగి వస్తున్న మార్గమధ్యలో కిష్టయపల్లి శివారు ప్రాంతాని కి రాగానే , ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం తన వద్ద ఉన్న కత్తులతో విచక్షణారహితంగా వెంకటేష్ ను పొడిచి చంపారు.

నిందితులు యాదగిరి, రాజేష్ , జగదీశ్ , సాయి కిరణ్ , షేక్ ఫరీద్, నవీన్ లను అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న నగదు, కత్తుల ను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.