అంబులెన్స్ రాలె.. స్కూటర్​పైనే దవాఖానకు.. ఇద్దరు మృతి

అంబులెన్స్ రాలె.. స్కూటర్​పైనే దవాఖానకు.. ఇద్దరు మృతి
  • ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ కరోనా సస్పెక్ట్స్
  • మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఘటనలు

ఇండోర్: ఇద్దరు కరోనా సస్పెక్టెడ్​ పేషెంట్లు టైంకు ట్రీట్​మెంట్ అందక ప్రాణాలు కోల్పోయారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లు నిరాకరించడంతో.. బంధువులు సూవీలర్​పైనే వారిని హాస్పిటల్​కు తీసుకురావాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఈ ఘటనలు జరిగాయి. దీనిపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది.

హాస్పిటల్​కు వెళ్లేసరికే మృతి​
60 ఏండ్ల పండు చందనే ఇండోర్​లోని బడ్​వాలీ చౌకీలో ఉంటున్నాడు. సిటీలోని కరోనా కంటెయిన్​మెంట్ ఏరియాల్లో అది కూడా ఒకటి. సోమవారం పండు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అతడిని చూసిన స్టాఫ్​ ఏవో కొన్ని మందులు రాసి.. ఇంటికి పంపేశారని పండు సోదరుడు చెప్పాడు. ఆ తర్వాత రోజు పండు పరిస్థితి మరింత సీరియస్​గా మారడంతో అంబులెన్స్​ పంపాలని అతని ఫ్యామిలీ హాస్పిటల్​కు ఫోన్​ చేసింది. దానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. వేరే దారి లేక పండును టూ వీలార్​పైనే మహారాహా యశ్వంత్​రావు(ఎంవై) హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి వెళ్లే సరికే పండు చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. సరైన టైంకు అంబులెన్స్​ పంపకపోవడం వల్లే పండు చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇండోర్ మెడికల్ ఆఫీసర్​ డాక్టర్ ప్రవీణ్​ జడియా కొట్టిపారేశారు. మంగళవారం మొదట అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడి నుంచి ఎంవై హాస్పిటల్​కు రిఫర్​ చేయడంతో ఇక్కడికి తీసుకొచ్చారని, హాస్పిటల్​కు వచ్చే సరికే అతడు చనిపోయాడని ఆయన చెప్పారు.
ఈ ఘటన నిజమేనని, అతడి ఫ్యామిలీ మెంబర్స్​కు కూడా కరోనా టెస్టులు చేస్తున్నామని ఎంవై హాస్పిటల్​ సూపరింటెండెంట్​ పీఎస్ ఠాకూర్ చెప్పారు. మరో ఘటనలో ఖాండ్వా జిల్లా ఖదక్​పూర్​ ఏరియాకు చెందిన షేక్​ హమీద్(65)కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బ్లడ్​ సుగర్​ ప్రాబ్లమ్స్, హై బ్లడ్​ ప్రెషర్​​తో ఇబ్బంది పడుతున్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ నిరాకరించడంతో స్కూటర్​పైనే తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్​కు చేరే సరికే హమీద్​ చనిపోయాడు. ఖదక్​పూర్​ ఏరియా కూడా కంటెయిన్​మెంట్​ జోన్​ గా ఉంది.