
- ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ కరోనా సస్పెక్ట్స్
- మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘటనలు
ఇండోర్: ఇద్దరు కరోనా సస్పెక్టెడ్ పేషెంట్లు టైంకు ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోయారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లు నిరాకరించడంతో.. బంధువులు సూవీలర్పైనే వారిని హాస్పిటల్కు తీసుకురావాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటనలు జరిగాయి. దీనిపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది.
హాస్పిటల్కు వెళ్లేసరికే మృతి
60 ఏండ్ల పండు చందనే ఇండోర్లోని బడ్వాలీ చౌకీలో ఉంటున్నాడు. సిటీలోని కరోనా కంటెయిన్మెంట్ ఏరియాల్లో అది కూడా ఒకటి. సోమవారం పండు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతడిని చూసిన స్టాఫ్ ఏవో కొన్ని మందులు రాసి.. ఇంటికి పంపేశారని పండు సోదరుడు చెప్పాడు. ఆ తర్వాత రోజు పండు పరిస్థితి మరింత సీరియస్గా మారడంతో అంబులెన్స్ పంపాలని అతని ఫ్యామిలీ హాస్పిటల్కు ఫోన్ చేసింది. దానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. వేరే దారి లేక పండును టూ వీలార్పైనే మహారాహా యశ్వంత్రావు(ఎంవై) హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి వెళ్లే సరికే పండు చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. సరైన టైంకు అంబులెన్స్ పంపకపోవడం వల్లే పండు చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇండోర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జడియా కొట్టిపారేశారు. మంగళవారం మొదట అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడి నుంచి ఎంవై హాస్పిటల్కు రిఫర్ చేయడంతో ఇక్కడికి తీసుకొచ్చారని, హాస్పిటల్కు వచ్చే సరికే అతడు చనిపోయాడని ఆయన చెప్పారు.
ఈ ఘటన నిజమేనని, అతడి ఫ్యామిలీ మెంబర్స్కు కూడా కరోనా టెస్టులు చేస్తున్నామని ఎంవై హాస్పిటల్ సూపరింటెండెంట్ పీఎస్ ఠాకూర్ చెప్పారు. మరో ఘటనలో ఖాండ్వా జిల్లా ఖదక్పూర్ ఏరియాకు చెందిన షేక్ హమీద్(65)కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బ్లడ్ సుగర్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్తో ఇబ్బంది పడుతున్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ నిరాకరించడంతో స్కూటర్పైనే తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్కు చేరే సరికే హమీద్ చనిపోయాడు. ఖదక్పూర్ ఏరియా కూడా కంటెయిన్మెంట్ జోన్ గా ఉంది.