విమానంలో టాయిలెట్ కు వెళ్లి.. చిక్కుకుపోయిన ప్రయాణికుడు

విమానంలో టాయిలెట్ కు వెళ్లి.. చిక్కుకుపోయిన ప్రయాణికుడు

బెంగళూరు: విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌ టేకాఫ్‌ కాగానే టాయిలెట్‌ రూమ్‌కు వెళ్లిన అతడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటన స్పైస్‌జెట్‌ విమానంలో నిన్న చోటు చేసుకొంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. ఎస్జీ 268 విమానం ముంబై నుంచి బెంగళూరు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రయాణికుడు టాయిలెట్‌ రూమ్‌కు వెళ్లాడు. 

డోర్‌ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయాడు. భయాందోళనకు గురైన అతడు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. తలుపును తెరిచేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నించినా.. ఫలితం లేకపోయింది. అతడు దాదాపు 100 నిమిషాల పాటు టాయిలెట్‌లోనే ఉండాల్సి వచ్చింది. విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన అనంతరం ఇంజినీర్లు వచ్చి తలుపు పగలగొట్టి ప్రయాణికుడిని రక్షించారు.