మంచు మనోజ్ రిటర్న్ గిఫ్ట్.. ఉస్తాద్’ ప్రోమో రిలీజ్

మంచు మనోజ్ రిటర్న్ గిఫ్ట్.. ఉస్తాద్’ ప్రోమో రిలీజ్

వెండితెరపై హీరోలుగా ఆకట్టుకుంటూనే, బుల్లితెరపై హోస్ట్‌‌గానూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఓటీటీ ద్వారా ఆడియెన్స్‌‌ను పలకరించబోతున్నాడు.  మనోజ్‌‌ హోస్ట్‌‌గా ‘ఉస్తాద్‍’  ర్యాంప్‍ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్‌‌ షో  రాబోతోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై  టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. ఈ టాక్‌‌ షో డిసెంబర్‌‌ 15 నుంచి ఈటీవీ విన్‌‌ యాప్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఫ్యాన్స్‌‌కు మనోజ్ ఇస్తోన్న రిటర్న్ గిఫ్ట్ ‘ఉస్తాద్’ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ‘గ్యాప్ తీసుకున్నందుకు ఫ్యాన్స్ నన్ను క్షమించాలి. ఇప్పటి వరకు ప్యాషన్‌‌, గోల్‌‌తో సినిమాలు చేశా. ఇప్పుడు ప్యాషన్ కంటే బాధ్యతతో వస్తున్నా. ఈ షో కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఇదొక సెలబ్రెటీ గేమ్‌‌ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్‌‌ కోసం ఒక సెలబ్రెటీ ఆడే ఆట’ అని చెప్పాడు. ‘ఫ్యాన్స్‌‌ని గెలిపించే షో ఇది.  చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాం’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. డైరెక్టర్ వంశీ, బీవీఎస్ రవి, క్రియేటివ్ హెడ్ నితిన్ చక్రవర్తి, సాయి కృష్ణ, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.