ముషీరాబాద్, వెలుగు: మణిపూర్ సంక్షోభం కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రమే కాదని, దాని వెనుక లోతైన సామాజిక రాజకీయ కోణాలు ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. మణిపూర్ సంక్షోభంపై మౌనంగా ఉండడం సరి కాదన్నారు.
ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాఉద్యమాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ‘రూపొందిన మణిపూర్ సంఘీభావం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్లో నెలకొన్న అశాంతి, హింసాత్మక పరిస్థితులు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయని తెలిపారు. అక్కడ నలిగిపోతున్న సామాన్య ప్రజలు, బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.
దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేధావులు సామాజిక శక్తులు గళం విప్పాలని కోరారు. శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య విలువలను రక్షించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తక సంపాదకులు హేమలలిత, వెంకట్రావ్ పాల్గొన్నారు.
