బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా 'గవర్నర్: ది సైలెంట్ సేవియర్'( Governor: The Silent Saviour) . భారీ అంచనాలతో జూన్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. కానీ మనోజ్ బాజ్పేయి నటనకు మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
థియేటర్లలో మిస్ అయిన వారి కోసం మేకర్స్ ఈ 'గవర్నర్: ది సైలెంట్ సేవియర్' మూవీ ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చారు. జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే ఇది సాధారణ ప్రైమ్ సబ్స్క్రిప్షన్లో అందుబాటులో లేదు. సినిమా చూడాలంటే ప్రైమ్ సభ్యులు కూడా అదనంగా రూ.349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
కథేంటంటే?
1991లో భారత్ ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో దేశం దివాలా అంచుకు చేరుకుంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొత్తగా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఏ. రమణన్ పాత్రలో మనోజ్ బాజ్పేయి కనిపిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చలు, ఆర్థిక సంస్కరణల వెనుక జరిగిన పరిణామాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
రియలిస్టిక్ పొలిటికల్ డ్రామా..
ఈ సినిమాలో యాక్షన్, కమర్షియల్ హంగులు కంటే వాస్తవ సంఘటనలు, రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ కంటే రియలిస్టిక్ పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.
చిన్మయ్ డి. మండలేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్లాల్ షా తన సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. ఆదా శర్మ, మధు, నౌషాద్ మహమ్మద్ కుంజు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. భారత ఆర్థిక చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన 1991 సంక్షోభాన్ని తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
