- భర్తను చంపేసి 10 ముక్కలు చేసింది
- ఢిల్లీలో వెలుగు చూసిన మరో ఘోరం
- కొడుకుతో కలిసి హత్య చేసిన మహిళ
- శ్రద్ధ హత్య కేసు దర్యాప్తు చేస్తుండగా బయటపడ్డ దారుణం
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ఢిల్లీలో మరో దారుణం బయటపడింది. ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను చంపి 10 ముక్కలుగా నరికేసింది. ఇద్దరూ కలిసి బాడీ పార్ట్స్ను ఫ్రిజ్లో దాచి నాలుగు రోజుల పాటు సిటీలో వేర్వేరు చోట్ల పడేశారు. తూర్పు ఢిల్లీలోని పాండవ్నగర్లో దాదాపు 6 నెలల కింద జరిగిన ఈ ఘోరం సోమవారం నాడు బయటపడింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చేస్తున్న దర్యాఫ్తులో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాడీ పార్ట్స్ కోసం సెర్చ్ చేస్తుండగా పోలీసులకు పాండవ్నగర్లోని ఓ గ్రౌండ్లో కుల్లిన స్థితిలో మనిషి తల, చేతులు దొరికాయి. అవి శ్రద్ధవే అనే అనుమానంతో పోలీసులు వాటిని ల్యాబ్ టెస్ట్ కు పంపారు. అవి 40 ఏండ్లకు పైబడిన వ్యక్తివని రిపోర్ట్ రావడంతో ఉన్నతాధికారులు ఓ స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేసి, దర్యాఫ్తు చేయించారు. రివర్స్ మోడ్లో సీసీటీవీ ఫుటేజీలను వెతికిన పోలీసులు.. ఆ పార్ట్స్ పడేసిన తల్లీకొడుకులైన పూనమ్, దీపక్ను గుర్తించి అరెస్ట్ చేశారు. కొడుకు దీపక్తో కలిసి భర్త అంజన్ దాస్ను చంపేసినట్లు పూనమ్ ఒప్పుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.
నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు కోసి..
పోలీసుల దర్యాప్తులో నిందితులు పూనమ్(48), దీపక్(25) నుంచి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పాండవ నగర్లో నివాసం ఉంటున్న వీళ్ల కుటుంబం అంజన్దాస్(45) ను చంపడానికి ఈ ఏడాది జనవరి నుంచే ప్లాన్ చేస్తున్నారు. మే నెలాఖరున నిద్రమాత్రలు కలిపిన మందును అంజన్ దాస్తో తాగించారు. సోయిలేకుండా పడిపోయాక తల్లీకొడుకులు అంజన్ను గొంతుకోసి చంపేశారు. రక్తం మొత్తం పోవాలని డెడ్ బాడీని ఓ రోజంతా అలాగే వదిలేశారు. మరుసటి రోజు బాడీని 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టారు. అనుమానం రాకుండా వాటిని కల్యాణ్పురిలోని గ్రౌండ్తో పాటు పలుచోట్ల పడేశారు. పుర్రెను పాతిపెట్టినట్లు తల్లీకొడుకులు వివరించారు. అంజన్ దాస్ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. రాత్రిపూట దీపక్ ఓ బ్యాగ్ పట్టుకుని వెళ్తుండటం.. అతని వెనకే పూనమ్ వెళ్తుండటం కనిపించింది. ఇప్పటివరకు అంజన్ దాస్ కు చెందిన బాడీ పార్ట్స్ ఆరింటిని కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
కూతురు, కోడలుతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే..
పద్నాలుగేండ్ల వయసులోనే పూనమ్కు పెళ్లి జరిగింది. కొంతకాలం తర్వాత పూనమ్ ను వదిలేసి ఆమె భర్త ఢిల్లీకి వెళ్లిపోయాడు. వెతుక్కుంటూ ఢిల్లీ చేరుకున్న పూనమ్కు భర్త ఆచూకీ చిక్కలేదు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. అతడితో సహజీవనం చేసింది. 2016 లో అతడు చనిపోవడంతో 2017లో అంజన్ దాస్ ను పెళ్లిచేసుకుంది. బీహార్కు చెందిన అంజన్ కు అప్పటికే పెళ్లయి ఎనిమిది మంది సంతానం కూడా ఉన్నారు. పెళ్లయ్యాక చాల రోజులకు ఈ విషయం బయటపడడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలయ్యేవని పూనమ్ వెల్లడించింది. తాగుడుకు అలవాటైన అంజన్ తన కొడుకును డబ్బుల కోసం వేధించేవాడని చెప్పింది. ఇంట్లో దాచిన తన నగలను అమ్మేసి, వచ్చిన డబ్బును బీహార్లో ఉన్న మొదటి పెళ్లానికి పంపించాడని ఆరోపించింది. ఇంట్లో ఉంటున్న తన కూతురు, కోడలు(దీపక్ భార్య) తోనూ అసభ్యం గా ప్రవర్తించేవాడని తెలిపింది. దీంతో విసిగిపోయి అంజన్ను చంపేశామని పూనమ్ చెప్పింది.